ముంబైలోని సతారాకు చెందిన రవీంద్ర పాటిల్కు 25 ఏళ్లు. కష్టపడి కానిస్టేబుల్ అయ్యాడు. ముంబై పోలీసు విభాగంలో ఉద్యోగం. ఆ వెంటనే స్పెషల్ ఆపరేషన్ స్క్వాడ్(ఎస్వోఎస్)లో కమాండోగా చేరేం దుకు శిక్షణ. సరిగ్గా ఇదే సమయంలో సల్మాన్కు అండర్ వరల్డ్ ముఠాల నుంచి బెదిరింపులు రావడంతో ముంబై పోలీసు విభాగం.. పాటిల్ను సల్మాన్కు బాడీగార్డ్గా పంపింది. 2002 సెప్టెంబర్ 28న సల్మాన్ కారు ప్రమాదం రోజున పాటిల్ అదే వాహనంలో ఉన్నాడు. మద్యం మత్తులో ఉన్నందున కారు నడపొద్దని సల్మాన్ను పాటిల్ వారించినా వినలేదు.కారు బయల్దేరిన కాసేపటికే అమెరికా ఎక్స్ప్రెస్ బేకరీ సమీపంలోని ఫుట్పాత్పై పడుకున్నవారిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. సల్మాన్ ఖాన్ తన కారు ను ఫుట్ పాత్ పైకి ఎక్కించి ఒకరి మృతికి నలుగురి గాయాలకు కారణ మైన సంఘటనకు ప్రత్యక్ష సాక్షి రవీంద్ర. బాడీగార్డ్లా కాకుండా ఓ పోలీసులా వ్యవహరించిన పాటిల్ వెంటనే బాంద్రా స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్లో జరిగింది జరిగినట్టు చెప్పాడు. దీంతోసల్మాన్పై కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు కోర్టులో కూడా పాటిల్ సాక్ష్యమిచ్చాడు.
ఆ సాక్షంతో అతని జీవితమే మారిపోయింది. పోలీసు డిపార్ట్ మెంట్ ఎస్ ఓఎస్ ఉద్యోగం నుంచి తప్పించింది. అన్ని వైపుల నుండి పాటిల్ పై తీవ్రమైన వత్తిడులొచ్చాయి. చివరకు స్వంత డిపార్ట్ మెంట్ నుండి కూడా తీవ్రమైన వత్తిళ్ళు వచ్చాయి . పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం ఆయనను ఒంటరిని చేసింది.ఆ వత్తిళ్ళు తట్టుకోవడం ఆయన వల్ల కాలేదు . దాంతో ఉద్యోగానికి కూడా దూరమయ్యాడు. చివరకు ముంబయ్ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. అదే సమయంలో సల్మాన్ కేసు విచారణకు వచ్చింది . ఇతను కోర్టుకు రాలేదు.దాంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది .పోలీసులు పాటిల్ ను అరెస్టు చేసి జైలుకు పంపారు. డిపార్ట్ మెంట్ డిస్మిస్ చేసింది. అక్కడే ఆయనకు టీబీ సోకింది.ఆయన జైలు నుండి విడుదలయ్యే సరికి జుట్టు రాలిపోయి ,చిక్కిశల్యమై ఎవ్వరూ గుర్తుపట్టకుండా తయారయ్యాడు.భార్య విడాకులు తీసుకొని వెళ్ళిపోయింది. కొద్దిరోజులు రోడ్డుపై బిచ్చమెత్తుకుంటూ తిరిగాడు. ఆతర్వాత సెవ్రీ లోని టీబీ ఆస్పత్రిలో చేరి 2007, అక్టోబర్ 4న కన్నుమూశాడు. ఆయన నిజాయితీనే ఆయనను కాటికి పంపింది. సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు చివరకు ఆయన చావుకు కారణమయ్యింది.
బాలీవుడ్ ప్రముఖులంతా సల్మాన్ పైనే జాలి చూపిస్తున్నారు . కానీ మీడియాలో సల్మాన్ గురించే మాత్రమే వార్తలొస్తున్నాయి .ఈ కేసులో న్యాయం కోసం తన యవ్వనాన్ని, జీవితాన్ని ఫణంగా పెట్టిన ఈ కేసు ముఖ్య సాక్షి గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.